భారత క్రికెటర్లు ఇషాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటోపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. న్యూజిలాండ్తో తొలి టెస్టులో ఏకంగా 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయంపై అభిమానులు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. రెండో టెస్టు ఆడేందుకు క్రైస్ట్చర్చ్కు వెళ్తున్నామని కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్తో దిగిన ట్రావెల్ ఫొటోను ఇషాంత్ శర్మ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అదే ఫొటోను మయాంక్ కూడా షేర్ చేశాడు.
కివీస్తో తొలి టెస్టులో మంచి ప్రదర్శన చేయడంలో భారత జట్టు విఫలమైందని..ఇక మీరు రాక్స్టార్స్ మాదిరిగా సోషల్ మీడియాలో పోజులు కొట్టాల్సిన అవసరం లేదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఫొటోలకు పోజులు ఇవ్వడం ఆపి రెండో టెస్టు కోసం ఆటపై దృష్టి పెట్టాలని మరో అభిమాని వ్యంగ్యంగా స్పందించాడు.