పట్టణాల్లో స్మార్ట్‌ వాష్‌రూములు

 ఆధునిక పట్టణాల్ని ఆవిష్కరించాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనలకు అనుగుణం గా.. పురపాలక శాఖ స్మార్ట్‌ వాష్‌రూమ్‌లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచించింది. హైదరాబాద్‌లోని ‘లూకేఫ్‌'ల తరహాలో వచ్చే మూడునెలల్లో అన్ని పట్టణాల్లో వీటిని ఏర్పా టు చేసేందుకు సిద్ధమవుతున్నది. దానిలో కేవలం బాత్‌రూమే కాకుండా ఏటీఎం, కేఫ్‌, కియోస్క్‌ (చిన్నపాటి దుకాణం), వీలైతే మీ-సేవ కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. ప్రతి పట్టణంలో స్మార్ట్‌ వాష్‌రూమ్‌ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ మున్సిపల్‌ కమిషనర్లను ఇప్పటికే ఆదేశించా రు. వాష్‌రూమ్‌ల నిర్మాణానికి అనువైన ప్రాం తాలు, జనాభా ప్రాతిపదికన నిర్మించాల్సిన వాటి సంఖ్యపై ప్రాజెక్టు రిపోర్టు రూపొందించాలని సూచించారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు పద్ధతిలో భాగస్వాములయ్యేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కోరారు.